ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీ చక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మ వారు శుక్రవారం విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) రామలక్ష్మి దంపతుల నేతృత్వంలో, ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ ఆలయ కళ్యాణకళా వేదిక వద్ద ఉత్సవ ముర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం మూల విరాట్ కు ఏకాదశ మంగళ నీరాజనాలతో, వేదదర్బారు సేవ, చతుర్వేద స్వస్తి నీరాజన మహా మంత్రాలతో, సాయం సంధ్యా హారతి పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Download app link: install
డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు)తో కూడిన ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామభక్తమహాజనులతో కలసి ఆలయ నాల్గవ వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టిప్పాభట్ల రామకృష్ణ మాట్లాడుతూ వర్షికోత్సవ విశిష్ఠత గురించి, శ్రీ నూకాలమ్మ అమ్మ వారి వైభవం గురించి తెలియజేశారు.
ఈ నెల 17,18 మరియు 19వ తేదీలలో మూడు రోజుల పాటు పాడిపంటలు పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, లోకక్షేమార్థం విశేష సుమంగళి ద్రవ్యాలతో, పంచామృత అభిషేకాలు మరియు పుష్కర జలాలతో అభిషేకాలు, అష్టోత్తరశతకలశాలతో ప్రత్యేక పూజలు జరుగుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రముఖులు, మహిళలు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొని, ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.
Social Plugin