Hot Posts

6/recent/ticker-posts

నష్టపోయిన ప్రతీ రైతుని ప్రభుత్వం ఆదుకుంటుంది: ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి..

 
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతినడం చాలా బాధాకరమని, అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆలమూరు మండలం నవాబుపేట గ్రామంలో ధాన్యం రాశులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చిర్ల రైతులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, గ్రామ స్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులుతో నిరంతరం మాట్లాడుతున్నామని, రైతులు నష్టపోకుండా మిల్లర్లతో మాట్లాడి ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం సంవత్సరాలు, సంవత్సరాలు వేచిచూడవలసిన పరిస్థితి ఉండేదని, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు పంటల బీమా అమలు చేసి పంట నష్టం సంభవిస్తే త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నారని, రైతు భరోసా ద్వారా భూములు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఆర్ధిక సహాయం అందచేస్తున్నారని, రైతు భరోసా కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు, డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు, మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, కర్రీ నాగిరెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.