Hot Posts

6/recent/ticker-posts

జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు- సలహాలొద్దు, మద్దతివ్వాలని జనసైనికులకు సూచన..


 తాడేపల్లి గూడెంలో జరుగుతున్న టీడీపీ-జనసేన జెండా సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ టార్గెట్ గా రెచ్చిపోయారు. జగన్ ను అథఃపాతాళానికి తొక్కేవరకూ నిద్రపోనన్నారు. చంద్రబాబును జైల్లో పెడితే బాధేసి కూటమిని తానే ప్రతిపాదించినట్లు పవన్ తెలిపారు. ఇరు పార్టీలు సహకరించుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్నారు. అలాగే సలహాలిచ్చే కంటే మద్దతివ్వాలని సొంత పార్టీ జనసేన నేతలకు పవన్ కీలక విజ్ఞప్తి చేశారు.


సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్ కు 2024 ఎన్నికలకు యుద్దం ఇస్తామంటూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐదేళ్ల పాలనలో యువతను, రైతుల్ని, మహిళల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, అంగన్ వాడీల్ని మోసం చేసిన వ్యక్తి జగన్ కు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వైసీపీ రౌడీలు, గూండాలు బూత్ ఆక్రమిస్తే జెండాను మడతపెట్టి కర్రతో సమాధానం చెప్పాలనే ఈ సభకు జెండాపేరు పెట్టామన్నారు. తన ఓజీ సినిమాలో వచ్చే డబ్బుల్ని కిలో బియ్యం కూడా కొనకుండా హెలికాఫ్టర్లకు పెడుతున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.

మాట్లాడితే క్లాస్ వార్ అని చెప్పే జగన్ ఐదుగురు రెడ్లకు (పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి) రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారన్నారు. రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్లినా ఈ ఐదుగురే పంచాయతీలు చేస్తున్నారన్నారు. వైసీపీ గూంజాయిజాన్ని చూసి భయపడొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మనకు ఉద్ధండురైన రాజకీయ నేత చంద్రబాబు అండగా ఉన్నారన్నారు. తమ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలపై ఈ 45 రోజులు దాడి చేస్తే, భయపెడితే మక్కెలిరగ్గొట్టి మడత మంచంలో పెడతానంటూ పవన్ హెచ్చరించారు. జగన్ మాట్లాడితే తాను ఒక్కడినే అంటారని, కానీ తనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యేను తీసుకెళ్లిపోయిన నువ్వు ఒక్కడివా అని పవన్ ప్రశ్నించారు. 

వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి తాను రాజకీయాలు చేయలేదని, ప్రజాస్వామ్య ప్రయోజనాలు కాపడటానికే తాను పొత్తులు పెట్టుకున్నానన్నారు. సహకారం, సంఘర్షణ రెండూ పక్కపక్కనే ఉంటాయని, ఇప్పుడు తమది సహకారం ఇవ్వాల్సిన పరిస్ధితి అన్నారు. ఇప్పుడు టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బంగారంలా ఉంటుందన్నారు. ఇరు పార్టీలూ పోట్లాడుకుంటే జగన్ తిరిగి అధికారంలోకి వస్తాడన్నారు. జగన్ ప్రతిసారీ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడతాడని, కానీ తన దగ్గర జగన్ వ్యక్తిగత సమాచారం చాలా ఉందన్నారు. 

ఇంతవరకూ పవన్ శాంతిని, మంచితనాన్ని చూశావని, కానీ ఇప్పుడు జగన్ కు యుద్ధం ఇస్తానన్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం కల ఓ రాజకీయ ఉద్ధందుడు చంద్రబాబును 53 రోజులు జైల్లో పెడితే, ఆయన భార్యను నానా మాటలు అంటుంటే తనకు బాధేసిందన్నారు. కర్నూల్లో సుగాలి ప్రీతి మరణం రెండు చోట్ల ఓడిపోయిన తనలో నిస్సహాయత తెచ్చిందన్నారు. చంద్రబాబు నుంచి సుగాలి ప్రీత వరకూ, పరిశ్రమల్ని వద్దనుకుని వెళ్లిపోయిన వారి వరకూ ఇదే నిస్సహాయత చూశానన్నారు.

పదివేల పథకం చేతిలో పెట్టడమా, లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తన అన్న పనిచేసే మార్గం చూపించడం వల్లే భవిష్యత్తు బాగుందన్నారు. దాని వల్లే తాను కౌలు రైతులకు సాయం చేయగలిగానన్నారు. నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు అని, పారిశ్రామికవేత్తల్ని తెచ్చిన వ్యక్తి అన్నారు. కొందరు కులాల లెక్కలు తీస్తారని, కానీ వారిలో దాగి ఉన్న ప్రతిభను మాత్రం వెలికి తీయరన్నారు.

అభిమానులు తనను కాదని జగన్ కు ఓటేశారని, ఇప్పుడు బాధపడుతున్నారని పవన్ తెలిపారు. ఎంత తపన పడినా తాను రెండు చోట్ల ఓడిపోయానని, పరీక్ష ఫెయిలైతే విద్యార్ధి ఎలా బాధపడతాడో మీకు తెలుసా అని ప్రశ్నించారు. ఏ ఆటుపోట్లూ తీసుకోకుండా పార్టీని నడపలేనన్నారు. ఉద్యోగాలకు వెళ్లాలంటే కాండక్ట్ సర్టిఫికెట్ కావాలని, కానీ సీఎం, ఎమ్మెల్యేలకు ఏదీ అవసరం లేదన్నారు. పొద్దున్నే పథకం కింద డబ్బులిచ్చి సాయంత్రం సారా కింద పట్టుకుపోతారన్నారు. బాలయ్య, ప్రభాస్, మహేష్, రామ్ చరణ్ సినిమాలు హిట్టవ్వాలని కోరుకునే వాడినన్నారు. అలాంటి తాను మీరంతా బాగుండాలని కోరారు.

పొత్తులో తాను 24 సీట్లు తీసుకుంటే ఇంతేనా అని తన ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారని, బలి చక్రవర్తి కూడా వామనుడిని ఇంతేనా అన్నాడని గుర్తుచేశారు. జగన్ గుర్తుపెట్టుకో.. నిన్న అథఃపాతాళానికి తొక్కకపోతే తాను పవన్ కాదని, తన పార్టీ జనసేన కాదన్నారు. రేపు ఎన్నికలప్పుడు వైసీపీ వాళ్లకు తామేంటో తెలుస్తుందన్నారు. తాను ఒక్క సీటు సాధిస్తేనా రాజమండ్రి వస్తానంటే రాత్రికి రాత్రి రోడ్లు వేశారన్నారు. 24 సీట్లు గెలిస్తే ఎలా ఉంటుందో చూస్తారన్నారు. సామాన్యుడు వ్యూహం చేస్తే ఎలా ఉంటుందో జగన్ కు చూపిస్తామన్నారు. తనకు సలహాలు వద్దని, పోరాడే నాయకులు కావాలన్నారు.

క్షేత్రస్దాయిలో తమకు క్యాడర్ లేదని, బూత్ లెవల్ కార్యకర్తలు లేరని, ఓట్లు తెచ్చే నాయకత్వం లేదని, అందుకే ఓపిక పట్టాలని పార్టీ నేతలకు పవన్ సూచించారు. అందుకే పొత్తులు పెట్టుకున్నామన్నారు. ప్రజల నాడి, వాడి తెలియకుండా దశాబ్దం పాటు పార్టీని నడిపించగలమా అని ప్రశ్నించారు. కొంతమంది మద్దతుదారులన్న పేరు మీద తనను ప్రశ్నిస్తున్నారని, జగన్ బాబాయ్ ను చంపినా ఆయనకు ఓట్లేసినవారు ప్రశ్నించరన్నారు. ఓడిపోతున్నా గెలుస్తున్నామని చెప్పే సమూహం వారికి ఉందన్నారు. 

మీరు నా మద్దతుదారులైతే నాతో నడవాలని కోరారు. తనతో నడిచేవాళ్లే తనవారన్నారు. తనకు ఓ నియోజకవర్గం అంటూ లేదని, అన్ని నియోజకవర్గాలూ తనవేనని పవన్ తెలిపారు. పవన్ తో స్నేహం అంటే పవన్ చచ్చేదాకా అని, పవన్ తో శత్రుత్వం అంటే వాళ్లు చచ్చేదాకా అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అన్నారు. జగన్ కు సంబంధించినంత వరకూ పవన్ అంటే మూడు పెళ్లిళ్లని, జగన్ నాలుగు పెళ్ళాలు అంటాడని, తనకు లేని నాలుగో పెళ్లాం జగనే అన్నారు.