Hot Posts

6/recent/ticker-posts

ఆకలి కేకలతో 500 మంది చిన్నారులు మృతి


దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సూడాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా అది ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి దేశాన్ని ఏలి చివరికి వారిద్దరి మధ్యే యుద్ధం మొదలైంది. ఈ అంతర్యుద్ధంతో సూడాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సూడాన్ గురించి ఇప్పుడు బయటికి వచ్చిన విషయం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అక్కడ ఆకలి కేకలతో 500 మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిసింది. మరో 31 వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.



ఇద్దరు మిలటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు సూడాన్‌లో సామాన్యుల ఆకలి కేకలకు మిగిల్చింది. అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో ప్రజలు బలి అవుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఎప్పుడు ఎక్కడ తుపాకీ గుండు తాకి ప్రాణాలు కోల్పోతామో తెలియక క్షణం ఒక యుగంగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సూడాన్‌లో ప్రస్తుతం కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్యుద్ధంతో తీవ్రమైన దారుణ పరిస్థితులు తలెత్తాయి. దీంతో 500 మంది చిన్నారులు ఆకలితో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించడం సంచలనంగా మారింది. వీరితోపాటు మరో 31 వేల మంది పిల్లలు పోషకాహార లోపంతో అనారోగ్యం పాలయ్యారని తెలిపింది.



సూడాన్‌లో అంతర్యుద్ధం దారుణ పరిస్థితులను మిగిల్చినట్లు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్‌లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి నుంచి ఇప్పటివరకు ఆకలితో దాదాపు 500 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికంగా పనిచేసే సేవ్‌ ది చిల్డ్రన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. మరోవైపు.. 31వేల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పటికీ వారికి చికిత్స అందడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే చిన్నారుల మరణాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సేవ్ ది చిల్డ్రన్ సంస్థ.. ఈ స్థాయిలో చనిపోతారని తాము ఎన్నడూ ఊహించలేదని పేర్కొంది. ఈ ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉన్నా ఆకలితో చిన్నారులు చనిపోవడం తీవ్రంగా కలచివేస్తోందని సేవ్‌ ది చిల్డ్రన్‌ సూడాన్‌ డైరెక్టర్‌ ఆరీఫ్‌ నూరీ పేర్కొన్నారు. మరోవైపు ఘర్షణల కారణంగా అనేక మంది ప్రజలకు తాగు నీరు, విద్యుత్‌ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే సూడాన్‌లో ఆరోగ్య వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలిపోయిందని తెలుస్తోంది. దీంతో మరిన్ని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.



అసలు సూడాన్‌లో ప్రస్తుత ఘర్షణలకు కారణం పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే. దీంతో అక్కడ సూడాన్ సైన్యానికి పారామిలిటరీ బలగాల మధ్య యుద్ధానికి దారితీసింది. ఏప్రిల్ 15 వ తేదీన మొదలైన ఈ అంతర్యుద్ధంలో దాదాపు 4 వేల మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంద. అయితే నిజానికి ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా దాదాపు 44 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు, ఇతర దేశాలకు తరలి వెళ్లిపోయినట్లు ఐక్యారాజ్యసమితి శరణార్థి విభాగం అంచనా వేసింది.