Hot Posts

6/recent/ticker-posts

మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం.. రైతు మేలు కోరే ప్రభుత్వం : హోంమంత్రి తానేటి వనిత

 

కొవ్వూరు: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగానే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోను లేనివిధంగా ప్రతి అడుగులోనూ రైతుకు అండగా నిలుస్తూ రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకూ అన్ని సేవలు రైతు ఇంటి ముంగిటనే అందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రైతులను మభ్యపెట్టే పనిలో ఉన్నారని, ఎంత ప్రయత్నించినా ప్రతిపక్షాల కుయుక్తులు పనిచేయవని ఆమె విమర్శించారు. ఈ మేరకు శనివారం హోంమంత్రి వారి కార్యాలయం నుండి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఈ సందర్బంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రైతులందరికీ జగనన్న ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని, ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి ప్రతి గింజను కొనాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఏ రైతు పండించిన పంటకూ ఇబ్బంది కలుగకుండా  రంగుమారిన, తడిసిన ఏ ధాన్యాన్నైనా కొనుగోలు చేయండని  మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

గత ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అని రైతన్నలను ఇబ్బంది పెట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఉచిత కరెంటు ఇస్తే కరెంటు తీగల్లో కరెంటు ఉండదు, తీగల మీద బట్టలారేసుకోవచ్చు అని హేళన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి రైతుల కోసమంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హాయాంలో జరిగిన రాజధాని భూముల్లో అక్రమాలు, విధాన నిర్ణయాల్లో తప్పులపై సిట్ విచారణకు హైకోర్టు స్టేను వెకేట్ చేసి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు విచారణకు అనుమతి ఇవ్వడంతో ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రతిపక్ష నేత పర్యటనలు చేస్తున్నారే తప్ప రైతులపై ప్రేమతో కాదని తెలిపారు. ఏదో రకంగా రాజకీయం చేసి వాళ్ల పార్టీ ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చివరికి ప్రతిపక్ష నేతకు రక్షణగా వచ్చిన పోలీసుల మీద నిందలు వేయడం దారుణమన్నారు. పోలీసులా..? రౌడీలా..? అని 40 ఏళ్ల అనుభవం గల ప్రతిపక్ష నేత మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ల రాజకీయ లబ్ధికోసం రైతులను వాడుకుంటున్నారని తెలిపారు. గోనె సంచుల ఖర్చు, హామాలీల (లేబర్) ఛార్జీలు, రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.